సైన్స్ బోధన అనేది సృజనాత్మకంగా వైజ్ఞానికంగా ఉండాలి
: ప్రొఫెసర్ డా.క్వాజీ అజ్హర్
హైదరాబాద్, మే 10 : సైన్స్ బోధన అనేది సృజనాత్మకంగా వైజ్ఞానికంగా ఉండాలి. వైజ్ఞానిక పద్ధతుల్లో బోధన జరిగే అమెరికా జపాన్ జర్మనీ చైనా వంటి దేశాలు సైన్స్ అండ్ టెక్నాలజీలో ఎంతో ప్రగతి సాధిస్తున్నాయి అని మిచిగన్ యూనివర్సిటీ ప్రొఫెసర్ డా.క్వాజీ అన్నారు.
హైదరాబాద్ నగరం సుందరయ్య విజ్ఞానకేంద్రం లో బుధవారం విజ్ఞానదర్శిని అధ్యక్షుడు రమేష్ అధ్యక్షతన అమెరికాలో స్కూల్ సైన్స్ – పాఠ్యాంశాలు, పాఠ్యప్రణాళిక, పెడగాజీ అనే అంశంపై సదస్సు జరిగింది. చెప్పింది విని బట్టి కొట్టడం కాకుండా సైన్స్ నేర్చుకోవాలంటే ప్రతి అంశాన్ని ప్రయోగాత్మకంగా పరిశోధించి తెలుసుకోవాలన్నారు ప్రొఫెసర్ క్వాజీ అజ్హర్. సైన్స్ పద్ధతి అనేది ప్రతి విద్యార్థి అలవర్చుకోవాలి. అమెరికాలో 4వ తరగతి నుండి పదవ తరగతి వరకు ప్రతి తరగతిలో సైన్స్ పద్ధతి అనేది ఒక పాఠ్యాంశంగా ఉంటుందన్నారు ఆయ. సైన్స్ పద్ధతి చెప్పే విధానం పై తరగతికి పొయిన కొద్దీ స్టాండర్డ్ పెరుగుతుంది. ఏ విధంగా సైంటిస్టులు తమ ప్రయోగశాలలో పరిశోధనలు చేస్తారో విద్యార్థులు తరగతి గదిలో అదేవిధంగా పరిశోదాత్మక విద్యను నేర్చుకుంటారని వివరించారు.
మన దేశంలో సైన్సును పద్యాలను బట్టి పట్టినట్టు లేదా సైన్ సూత్రం వివరించి దానికి కోసం ఒక ప్రయోగం టీచర్స్ చేసి చూపిస్తారు. ఇదే బోధన పద్ధతి మన కరికులంలో భాగంగా ఉంది. టీచర్లు చెప్తుంటే విద్యార్థులు వినడం మాత్రమే మన దగ్గర ఉంటుంది కానీ అమెరికా సైన్స్ బోధన విధానాన్ని పరిశీలిస్తే ఎందుకు భిన్నంగా ఉంటుంది. టీచర్ సైన్స్ నేర్చుకునే విద్యార్థులకు ఫెసిలిటేటర్ గా మాత్రమే ఉంటారు. విద్యార్థులు స్వయంగా తామే ప్రయోగాలు చేస్తూ పరిశోధనలు చేస్తారు. ఏదైనా సందేహాలు వస్తే నివృత్తి చేయడానికి మాత్రమే టీచర్లు వారి వెనకాల ఉంటారని పేర్కొన్నారు ప్రొఫెసర్ క్వాజీ అజ్హర్.
విద్యార్థులు స్వయంగా చేస్తూ నేర్చుకుంటారు. ఇది అనేక పరిశోధనల్లో తేలిన సత్యం. అందుకే ఆ బోధనా విధానాన్ని అనుసరిస్తారు దానికి అనుగుణంగానే పాఠ్యప్రణాళికలు, పాఠ్యాంశాలు, బోధనా పద్ధతులు రూపొందించబడతాయి. అందుకే అమెరికాలో ఎందరో నోబెల్ బహుమతి గ్రహీతలు తయారవుతుంటారు. అక్కడ సైన్స్ కూడా వేగవంతంగా ఎదుగుతూ నాణ్యవంతంగా ఉంటుంది. సైన్స్ నేర్చుకోవడంలో మాతృభాష కూడా ముఖ్యమైన పాత్ర పోషిస్తుందన్నారు ఆయన.
పిల్లలకు తమ రోజువారి జీవితంలో వాడుకునే భాష సైన్స్ సులభంగా నేర్చుకోవడానికి తోడ్పడుతుంది. ఫిన్లాండ్ విద్యారంగంలో ముందు పీఠిన ఉండడానికి కారణం మాతృభాషలో బోధన ప్రధానం. సైన్స్ బోధన పద్ధతి పూర్తిగా మారాల్సిందే. ఉపాధ్యాయులు నూతన బోధన పద్ధతులను నేర్చుకొని విద్యార్థులను వైజ్ఞానికంగా తీర్చిదిద్దాలి. వైజ్ఞానిక దృక్పథం ప్రతి ఒక్క విద్యార్థి అలవర్చాలి. సైన్స్ తరగతి గది సజీవమైన, ఆనందమయ ప్రయోగశాలగా, పరిశోధన కేంద్రంగా మారిన నాడు భారతదేశం వైజ్ఞానికంగా అగ్రగామిగా నిలుస్తుంది. అందుకు ఉపాధ్యాయులు సృజనాత్మకంగా వైజ్ఞానిక పద్ధతుల్లో కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు ప్రొఫెసర్ క్వాజీ అజ్హర్.ఈ సదస్సులో విజ్ఞాన దర్శనీ ప్రధాన కార్యదర్శి విజయ కందుకూరి, కోర్ టీం మెంబర్ శోభారాణి, విజ్ఞానదర్శిని నాయకులు రామకృష్ణ, యాదగిరి పాఠ్యపుస్తక రచయితలు విజయ ప్రతాప్, జయరాజ్ తదితరులు పాల్గొన్నారు.