Logo

తిరుమలలో టెక్నాలజీ భద్రత

తిరుమలలో టెక్నాలజీ భద్రత

తిరుమల, మే 26 : ఆధునిక టెక్నాలజి సాయంతో తిరుమలలో పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేపడతామన్నారు రాష్ట్ర హోంశాఖ ప్రధాన కార్యదర్శి హరీష్ కుమార్ గుప్తా. తిరుమలలో రెండు రోజులపాటు భద్రతాపరమైన అంశాలపై సమీక్ష నిర్వహించామని చెప్పారు. సీసీటీవీ కంట్రోల్ రూమ్ లో కృత్రిమ మేధను ఎలా వినియోగించాలి, ఎలాంటి సాఫ్ట్‌వేర్‌లు వాడాలి అనే అంశాలపై అధ్యయనం చేస్తామన్నారు. అదేవిధంగా యాంటీ డ్రోన్ టెక్నాలజీ, బాడీ స్కానర్స్ వినియోగంపై ప్రతిపాదనలు సిద్ధం చేస్తామని తెలిపారు.

తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ -1 ను పరిశీలించారు.తిరుమలలో భద్రతను మరింత కట్టుదిట్టం చేసేందుకు క్షేత్రస్థాయిలో పరిశీలన జరపడానికి ఎస్పీ లేదా ఏఏస్పీ స్థాయి అధికారి ఆధ్వర్యంలో ఏడు కమిటీలు ఏర్పాటు చేశామన్నారు డీఐజీ అమ్మిరెడ్డి. ఈ కమిటీల్లోని అధికారులు 15 రోజుల పాటు పరిశీలన జరిపి నివేదిక సిద్ధం చేస్తారని.. మరోసారి సమావేశమై సమీక్షిస్తామని వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తర్వాత కమిటీలు చేసిన సూచనలను క్షేత్రస్థాయిలో అమలు చేస్తామన్నారుఅంతకుముందు తిరుమల శ్రీవారి ఆలయం, కొత్త పరకామణి భవనం, వైకుంఠం క్యూ కాంప్లెక్స్-1, కమాండ్ కంట్రోల్ రూమ్ తదితర ప్రాంతాలను పోలీసు ఉన్నతాధికారులు పరిశీలించి భద్రత అంశాలను తనిఖీ చేశారు. కమాండ్ కంట్రోల్ రూమ్ లో తిరుమలలో సీసీ కెమెరాల ద్వారా నేరస్తులను గుర్తించే విధానాన్ని పరిశీలించారు.

తిరుమల అన్నమయ్య భవనంలో టీటీడీ సీవీఎస్వో నరసింహ కిషోర్, ఇంటెలిజెన్స్ ఎస్పీ సుమిత్ ఆధ్వర్యంలో ఉన్నత స్థాయి సమావేశం జరిగింది.మరోవైపు తిరుమలలో భద్రతాపరమైన అంశాలపై తిరుమల అన్నమయ్య భవన్‌లో ఉన్నత స్థాయి సెక్యూరిటీ ఆడిట్‌ జరిగింది. కోవిడ్ అనంతరం తిరుమలకు యాత్రికులు పెరగడం, వాహనాల రద్దీ పెరగడంతో భద్రతను ఎలా పెంచాలనే విషయమై చర్చించడానికి టీటీడీ భద్రతాధికారులు, పోలీసు శాఖ, ఇతర శాఖల ఉన్నతాధికారులు సమావేశంలో పాల్గొన్నారు. తిరుమలకు పటిష్టమైన భద్రత కోసం అన్ని దళాలను ఒకే గొడుగు కిందకు తీసుకురావాలని హరీష్ కుమార్ గుప్తా అభిప్రాయపడ్డారు. అంతకుముందు, టీటీడీ సీవీఎస్వో శ్రీ నరసింహ కిషోర్, తిరుపతి ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి వేర్వేరుగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌ ఇచ్చారు. తిరుమలకు సంబంధించి ఇప్పటికే ఏర్పాటు చేసిన భద్రత, ఇంకా భద్రతను మరింత పటిష్టం చేయవలసిన ప్రదేశాల గురించి తెలియజేశారు.

అలిపిరి సప్తగిరి టోల్‌గేట్ దగ్గర టీటీడీ ఉద్యోగులను, కూరగాయల వాహనాలను, కార్గో వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేయాలని.. ఆ తర్వాతనే తిరుమలకు అనుమతించాలని.. అప్పుడే నిషేధిత వస్తువులను అరికట్టగలమన్నారు. తిరుమలలో శాంతి భద్రతల కోసం క్రైమ్ పార్టీ, ఐడి పార్టీలను బృందాలుగా ఏర్పాటు చేసి ముందస్తు సమాచార వ్యవస్థను బలోపేతంతో కట్టడి చేస్తున్నామన్నారు. తిరుమల పుణ్యక్షేత్రం నందు ఎమర్జెన్సీ అలారం సిస్టంను ఏర్పాటు చేసేందుకు సాధ్యాసాధ్యాలను పరిశీలించుటకై కమిటీ ఏర్పాటు చేయనున్నారు. ఇలా చాలా నిర్ణయాలు తీసుకున్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking